కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత

  • పదేళ్లుగా కేటీఆర్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదన్న కవిత
  • ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా
  • అందరికీ అధికారం కావాలని తాను అన్న తర్వాతే కష్టాలు మొదలయ్యాయని వెల్లడి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్ పై విమర్శల దాడిని ఉద్ధృతం చేశారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో పలు సామాజిక సంఘాల నేతలతో భేటీ అయిన ఆమె, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై రాజీకయంగా అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


"పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎందుకు ప్రజల్లోకి పోలేదు? ఇప్పుడు పాదయాత్రలు చేస్తానంటే ఎవరు నమ్ముతారు?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ పాదయాత్ర ప్రస్తావనను ఎద్దేవా చేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని వారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం వెనుక అర్థమేంటని నిలదీశారు.


సామాజిక తెలంగాణే లక్ష్యంగా తాను కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టానని, అందుకే తనకు అనేక కష్టాలు వచ్చాయని కవిత పేర్కొన్నారు. "అందరికీ అధికారం అందాలని నేను మాట్లాడటం మొదలుపెట్టాకే నాకు సమస్యలు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేసినా, సామాజిక తెలంగాణ సాధించే వరకు నా పోరాటం ఆగదు" అని ఆమె స్పష్టం చేశారు. 


తన కొత్త పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ వంటి బహుజన సంఘాలు మద్దతు తెలపడం తనకు కొండంత బలాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. వీరన్న అనుచరులు తనతో కలవడమంటే ఇక తమను ఆపే శక్తే లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


బీఆర్ఎస్‌కు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడతానని బాంబు పేల్చారు. గ్రహగతులు అనుకూలించాలని, ఏదైనా శని అడ్డు ఉంటే తొలగిపోవాలని వారణాసిలో పూజలు చేసినట్లు కూడా ఆమె వెల్లడించారు.


Kavitha
KTR
BRS
Telangana Politics
Kalvakuntla Kavitha
Maroju Veeranna
Social Telangana
Telangana Jagruthi
Padayatra
Former MLAs

More Telugu News